- తాను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు రూ.40 వేల విలువైన టీ-షర్టుల పంపిణీ
- ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, ఐడెంటిటీ కార్డుల బహూకరణ
భీమడోలు, జూలై 24 (జనస్వరం): కన్నతల్లి లాంటి పుట్టిన ఊరిని, తాను చదువుకున్న పాఠశాలను మర్చిపోలేని యువ పారిశ్రామికవేత్త, హైదరాబాద్కు చెందిన ఫ్యూచర్ నెట్వర్క్స్ సీఈవో రెడ్డి దుర్గాప్రసాద్ తన మమకారాన్ని చాటుకున్నారు. గుండుగొలను సంతపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల–1లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒకప్పుడు తాను చదువుకున్న ఇదే పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న సుమారు 127 మంది విద్యార్థులకు రూ.40 వేల విలువైన ఏకరూప టీ-షర్టులను బహూకరించారు. అదేవిధంగా తాను చదువుకున్న గుండుగొలను శ్రీ మవులేటి సోమరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005–2006 విద్యా సంవత్సరపు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన 'సమన్వయ సేవా సమితి' ట్రస్ట్ ద్వారా, ట్రస్ట్ చైర్మన్ రెడ్డి దుర్గాప్రసాద్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు (యూనిఫాంలు), ఐడెంటిటీ కార్డులను కూడా బహూకరించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫాంలు, ఐడెంటిటీ కార్డులను స్వచ్ఛంద సంస్థ ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
