అమరావతి, ఏప్రిల్ 03 (జనస్వరం) : విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డప్పు కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. కళాకారుల పెన్షన్ పెంపుతో పాటు పంచాయతీ వ్యవస్థలో ‘దండోరా’ పోస్టుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రచార కార్యక్రమాల్లో వారికి తగిన అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ డప్పు కళాకారుల సంక్షేమం కోసం సమగ్ర ప్రణాళిక అవసరమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారుల సమస్యలను గుర్తించి వారి జీవనోపాధి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా పథకాలు అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. అలాగే డప్పు కళను సంరక్షించేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, యువతలో ఈ సంప్రదాయ కళపై ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. కళాకారులకు ఆరోగ్య భీమా, ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో డప్పు కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారి జీవనోపాధి మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పన్నతల సురేష్, ఇతర నాయకులు, డప్పు కళాకారులు పాల్గొన్నారు.
