విజయవాడ, ఫిబ్రవరి 11, (జనస్వరం) : భోగాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సాగు భూములపై నెలకొన్న సమస్యలపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి స్పందించారు. బుధవారం విజయవాడలో తనను కలిసిన భోగాపురం రైతులతో ఆమె సమావేశమై పూర్తి మద్దతు ప్రకటించారు. భోగాపురం తూర్పు, పడమర ఖండాల్లో సాగులో ఉన్న పల్లం భూములను ఐటీ పార్క్ నిమిత్తం ప్రైవేట్ సంస్థలకు కేటాయించవద్దని రైతులు విజ్ఞప్తి చేశారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములే తమ జీవనాధారమని, వాటిని సేకరిస్తే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వాదనను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. ఈ భూ సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లతో స్వయంగా చర్చించి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, క్షేత్రస్థాయిలో రైతులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బాధిత రైతులు పాల్గొని తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఎమ్మెల్యేకు అందజేశారు.