Search
Close this search box.
Search
Close this search box.

ధర్మాన ! పరుగు పందేలు ఆపి పాలనపై దృష్టి పెట్టండి : విశాఖ జిల్లా జనసేన నాయకులు

● దానగుణం, ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ తో పోటీ పడండి
● జనసేనాని వల్లే ఉద్ధానం కిడ్నీ సమస్య ప్రపంచానికి తెలిసింది
● తిత్లీ తుపాన్ సమయంలో మీరు ఎక్కడున్నారు?
 పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తే మీకు ఎందుకు భయం?
● మీడియాతో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు

      విశాఖపట్నం, (జనస్వరం) : గడప గడపకూ వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు ప్రజల నిలదీతలతో ఎక్కడిలేని కోపం వస్తోందని, దానిని పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్ నాతో నడవగలరా? పరిగెత్తగలరా? అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు మంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కోన తాతారావు అన్నారు. ప్రజాసేవలో, ప్రజా సమస్యలపై పోరాటాల్లో పవన్ కళ్యాణ్ తో పోటీ పడితే ప్రజలు హర్షిస్తారు తప్పా! చవకబారు కామెంట్లు చేస్తే ప్రజలు హర్షించరన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విశాఖ జిల్లా జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కోన తాతారావుతో పాటు జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్, పసుపులేటి ఉషా కిరణ్, పీవీఎస్ఎన్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో నడవడంలో పోటీ పడటం కాదు. సొంత డబ్బును ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు వెచ్చిస్తున్న సేవలో పోటీ పడండి. రూ.2 కోట్లను సైనిక సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చిన ఆయన దేశభక్తిలో పోటీపడండి. మూడేన్నరేళ్ల పాలనలో ప్రజలు ఈ పాలకులను గడగడపకూ ప్రోగ్రాంలో చీత్కరించుకోవడంతో ధర్మాన నోటి నుంచి మతి లేని ఇలాంటి మాటలు వస్తున్నాయి. అభిమానంతో యువకులు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఫొటోను చూసే మీకు భయమేస్తోంది అంటే మీ పాలనపై మీకే నమ్మకం లేదని అర్ధం అవుతుంది. 45 సంవత్సరాల ప్రజా జీవితంలో సీనియర్ గా పేరు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాకు గుర్తుండిపోయేలా చేసిన ఒక్క అభివృద్ధి పని కూడా లేదు. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడంలో పోటీ లేదు. స్థాయికి తగినట్లుగా మాట్లాడే పరిస్థితి లేదు. తరతరాలుగా శ్రీకాకుళం జిల్లాను పట్టి పీడిస్తున్న ఉద్ధానం కిడ్నీ సమస్యను ప్రపంచానికి తెలియచేసిన నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను ఆయన చేసి, ఎందరో అంతర్జాతీయ వైద్యులను ఉద్ధానం తీసుకొచ్చారు. అక్కడి ప్రజల ఆరోగ్య సమస్య పట్టని ప్రభుత్వాల నిద్ర వదిలించారు. పోరాట యాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎన్నో సమస్యలను బయటకు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తిని గౌరవించుకుంటే, మీకు గౌరవం దక్కుతుంది అన్నారు.

● నిజాయతీ లేని వాళ్లకే ఆయన ఫొటో చూస్తే భయం: సుందరపు విజయ్ కుమార్

    జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కటౌట్ చూస్తే నీతి, నిజాయతీ లేని వాళ్లకు భయం. ఈ మధ్యన రాజకీయాల్లోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ కళ్యాణ్ గురించి ఏదో అంటే ఏదో ముఖ్యమంత్రి మెప్పు కోసం అనుకున్నాంగానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న ధర్మాన వంటి వాళ్లు ఇలా మాట్లాడటం ఏ మాత్రం బాగాలేదు. పవన్ కళ్యాణ్ ధర్మాన వంటి పెద్దలకు తగిన గౌరవం ఇస్తారు. నిత్యం ప్రజల్లో ఉండే మా నాయకుడు పరుగులెత్తాల్సిన అవసరం లేదు. ఆయన సేవలు చూసి మీరు పరుగులు పెడుతున్నారు. అందుకే ఆయన చిత్రపటం చూసిన మీకు ఎక్కడ లేని కోసం వస్తోందని అన్నారు.

● తిత్లీ తుపాను సమయంలో ధర్మాన ఎక్కడున్నారు?:  పసుపులేటి ఉషాకిరణ్
      విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జి పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ మంత్రి చెబుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ వీధుల్లో నడిస్తే సాదాసీదాగా ఉండదు. అదో ప్రభంజనం అవుతుంది. అప్పుడు ఉత్పన్నం అయ్యే శాంతి భద్రతల సమస్యను ఈ ప్రభుత్వం గాలికొదిలేస్తుంది. ధర్మాన ప్రసాదరావు నడిచిన దానికి, పవన్ కళ్యాణ్ నడిచే దానికి చాలా తేడా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. గడపగడపకూ వైసీపీ అంటే ప్రజలు ఎక్కడ దగ్గరకు కూడా రానివ్వరో అన్న భయంతో గడపగడపకూ ప్రభుత్వం అని చెప్పుకొని తిరుగుతున్న మీరు కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శిచడం విడ్డూరంగా ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారు స్థాయిని తగ్గించుకునేలా మాట్లాడటం మంచిది కాదు. తిత్లీ తుపాను సమయంలో పవన్ కళ్యాణ్ వారం రోజుల పాటు శ్రీకాకుళంలో ప్రజలకు అండగా నిలబడినపుడు కనీసం ఇంటి గడప కూడా దాటని ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు కొత్తగా విమర్శలు చేయడం ఆయన అనుభవానికే తలవంపు. మీకు ఎలాగూ సొంత డబ్బులు సాయం చేయడం రాదు. అలా సాయం చేసే వారిని అభినందించి మీ పెద్దరికం నిలుపుకోండని హితవు పలికారు.

● సీఎం మెప్పు పొందడానికి తిప్పలుపడకండి: పీవీఎస్ఎన్ రాజు
      జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇంఛార్జి పీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. విశాఖ విధ్వంసాన్ని, ఉత్తరాంధ్రకు సాగునీరు ఇవ్వకపోవడాన్ని పరిష్కరించలేని పాలకులు దిగజారుడు వ్యాఖ్యలకు దిగుతున్నారు. ఉత్తరాంధ్ర వ్యవసాయం నాశనం అవుతోంది.. యువత నిరుద్యోగంలో ఉన్నారు. పారిశ్రామిక వేత్తలు ఈ ప్రభుత్వ విధానాలు చూసి పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఎక్కడా చూసినా, ఏ వ్యవస్థ పరిశీలించినా ఘోరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాటిని సీనియర్లుగా పరిష్కరించాల్సిన నేతలు సీఎం మెప్పు కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. ఓ రాజకీయ నాయకుడు భారతదేశంలో మొదటిసారి సొంత డబ్బును కష్టాల్లో ఉన్న పేదలకు పంచడం చూసి అందరూ అభినందిస్తున్న తరుణంలో దాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర గౌవరం పెంచేలా సీనియర్ మంత్రులు మాట్లాడాలి. సేవ విషయంలో పవన్ కళ్యాణ్ ని అందుకోవడం మీకు సాధ్యం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోండని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way