సమస్యలు పట్టవా ! ప్రజా సమస్యల సాధనకై ఉద్యమిద్దాం : ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖగౌడ్
ప్రజలకు అన్ని విధాలుగా నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన హామీలు మాటలకే పరిమితం చేశారని ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల వైపు కనెత్తి చూడకుండా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని సమస్యల సాధనకై ప్రతి జనసైనికుడు అవినీతిపై పోరుకు సిద్ధం కావాలని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలోని జనసేనపార్టీ కార్యాలయంలో బుధవారం రోజు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు, గ్రామాలకు సంబందించిన కమిటీలను పూర్తిచేసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగానే పట్టణ, గ్రామీణ ప్రాంతలలో అభివృద్ధి కుంటుపడిందని వర్షాకాలం, వేసవికాలం, తేడా లేకుండా ప్రజలు సమస్యల వలయంలోనే జీవనం సాగిస్తున్నారని చాలా గ్రామాలలో సి.సి రోడ్లు లేక రహదారులు అస్తవ్యస్తంగా మారాయని కొన్ని గ్రామాల్లో నేటికి వేసవిలో త్రాగునీరు సమస్య అధికంగా వుందని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలపై పోరుకు గ్రామ కమిటీలను సిద్ధం చేసుకొని అధికారులపై ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేలా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. బలమున్న పెద్దలకు అందే ఇసుక పనిచేసే కార్మికులకు అందక పోవడం దురదృష్టకరమని నేడు సకాలంలో ఇసుక అందని పరిస్థితుల కారణంగా భవన నిర్మాణ కార్మిక రంగంపై ఆధారపడిన ఎందరో కార్మికులు కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పనుల కోసం కార్మికుల వలసలు ప్రారంభం అవుతాయని వలస నివారణకై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా, నాయకులు రాహుల్ సాగర్, గాజుల వెంకటేష్, రవి ప్రకాష్, షబ్బీర్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.