నెల్లిమర్ల, అక్టోబర్ 7, (జనస్వరం) : నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి వచ్చిన పలు రెవిన్యూ మరియు ఇతర శాఖలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీదారునితో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యల అంశాలను తెలుసుకుని, వెంటనే హాజరైన అధికారులకు సూచనలు ఇచ్చారు. హాజరు కాని అధికారులతో కూడా చరవాణి ద్వారా మాట్లాడి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా దర్బార్ లో భాగంగా నెయ్యిలు మరియు మత్స్యకార సహా సంబంధిత వర్గాల ప్రజలతో ఎమ్మెల్యే స్వయంగా సమావేశమయ్యారు. మత్స్య సంపదను ఆధారంగా జీవనం సాగించే మూడు ప్రధాన తెగల ఆర్థికాభివృద్ధి కోసం అవసరమైన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారులతో మాట్లాడిన సందర్భంగా చెరువుల్లో చేపల పెంపకం, సంరక్షణ, వాటి ద్వారా సంపదను పెంపొందించుకోవడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. స్థానిక మత్స్యకారులకు మరింత స్థిరమైన ఆదాయం లభించేలా ప్రాంతంలోనే హోల్సేల్ మార్కెట్ల ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు. మార్కెట్ ఏర్పాటుతో మధ్యవర్తులు తగ్గి, మత్స్యకారులకు నేరుగా మంచి ధర లభించే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ఈ మూడు తెగల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, త్వరలో కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసి సంబంధిత శాఖలతో కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. ప్రజా దర్బార్ లో వచ్చిన వినతులను దశల వారీగా పరిశీలించి, అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.