Search
Close this search box.
Search
Close this search box.

రాజధాని వ్యవహారంపై సామాన్యుడి ఆవేదన…

రాజధాని వ్యవహారంపై సామాన్యుడి ఆవేదన… 

       గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్ర ప్రజలు రాజధాని వ్యవహారంపై పాలకుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. ఇప్పటికీ మోసపోతూ, ముందు ముందూ కూడా మోసపోవాల్సిన పరిసస్థితి. ఆంధ్ర ప్రజలు తమకు స్వంతంగా శాశ్వతంగా ఒక రాజధాని అని ఒకటంటూ చెప్పుకోవడానికి లేక ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి గతానికి వెళ్తే మా తాత మా రాజధాని మద్రాస్ చెన్నై అని చెప్పాడు, మా నాన్న ఒకప్పుడు కర్నూలు మన రాజధాని అని చెప్పాడు. నేను నా రాజధాని హైద్రాబాదు అని కొంత కాలంగా చెప్పుకున్నా. మళ్ళీ నేనే మా రాజధాని అమరావతి అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇపుడు కొందరు వచ్చి మన రాజధాని విశాఖపట్నం, కర్నూలు అంటున్నారు. రేపు నా పిల్లలకి ఇంకో రాజధాని అంటూ ఫలానా పేరు చెప్పాలి. 100 సంవత్సరాల కాలంలో ఇన్ని రాజధానులు మావి అని చెప్పుకోవాల్సిన దుస్థితి మనది. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ పడితే అక్కడ రాజధాని మార్చుకుంటూ పోతే అసలు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ ఎప్పుడు అభివృద్ది చెందుతుంది. ఈ రాజధాని వ్యవహారంలో పాలకుల తప్పులు కొన్ని అయితే, అలాంటి పాలకులను ఎన్నుకున్న పౌరులుగా మనది కూడా తప్పే. 

        ఒకసారి ఇపుడు ఉన్న అమరావతి రాజధాని సగటు పౌరుడిగా నేను అంగీకరిస్తాను. అందుకు గల కారణాలు లేకపోలేదు. అమరావతి ముంపుకు సంబంధించిన ప్రాంతం అయితే కాదు, పైగా తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉండడమే కాకుండా, శత్రు దేశాలతో యుద్ధాలు వచ్చినపుడు అమరావతిని నాశనం చేసే దిశగా ఆలోచించే యోచన ఉండదు. అమరావతి, గుంటూరు మరియు విజయవాడల మధ్య ఉండడంతో అటు కోస్తాంధ్ర 6 జిల్లాలు, ఇటు రాయలసీమాంధ్ర 6 జిల్లాల మధ్య ఉంటుంది. కాబట్టి ఇరువురి ప్రజలకు సమానార్థ సౌకర్యంగా ఉంటుంది. రాజకీయంగా చూసుకున్నా కూడా 84 మంది ప్రజాప్రతినిధులు ఒకవైపు, 74 మంది ప్రజాప్రతినిధులు ఒక వైపు ఉంటారు. ఎంపీలు కూడా అటువైపు 12, ఇటువైపుగా 12 మంది సమానంగా ఉంటారు. జనాభా పరంగా చూసుకుంటే 2.35 కోట్ల జనాభా ఒకవైపు, 2.15 కోట్ల జనాభా ఒకవైపు ఇలా అన్నీ వైపులా ఆమోదయోగ్యంగా సరిసమానంగా ఉంటుంది. అమరావతి కృష్ణా నది ఉండడంతో నీటి కొరత పెద్దగా ఉండదు. అమరావతిలో ప్రస్తుతం జనాభా ఒక లక్షగా ఉంది. భవిష్యత్తులో పెరిగినా 10 లక్షలకు మించకపోవచ్చు. సమగ్రమైన ప్రణాళిక ఉంది కాబట్టి కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉండదు. 

         ఇపుడు విశాఖపట్నం జిల్లాను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ మ్యాపులో ఒక వైపున ఒక మూలాన ఉంటుంది. ఇక్కడ భారత రక్షణ రంగం, భారత వాయు సేన, భారతీయ మరిన్ని కేంద్రాలు ఉన్నాయి. పైగా తీరానికి ఆనుకొని ఉంటుంది. భవిష్యత్తులో శత్రుదేశాలతో యుద్ధం వచ్చినపుడు విశాఖపట్నంను దాడి చేయడానికి శత్రు దేశాలకు ఆస్కారం ఉంది. తీరం వెంబడి ఉండడంతో తరచూ తుఫానులు, సునామీలు రావడం చూశాం. గతంలో వచ్చిన హూద్ హూద్ తుఫాన్ విశాఖపట్నాన్ని ఎంత అతులాకుతులం చేసిందో చూశాం. విశాఖకు 10 జిల్లాలు ఒకవైపు, 2 జిల్లాలు ఒకవైపుగా ఉంటాయి. 1000కిలో మీటర్లు దాదాపుగా అటువైపుగా, 200కిలోమీటర్లు ఇటువైపుగా ఉంటుంది.  జనాభా పరంగా చూసుకున్న దాదాపుగా 3.5 కోట్ల జనాభా ఒకవైపు, 1.50 కోట్ల జనాభా ఒకవైపుగా ఉంటుంది. పైగా విశాఖపట్నం నీటి కొరతను చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా చూసుకుంటే 141 మంది ఎమ్మేల్యేలు ఒకవైపు, 19 ఎమ్మేల్యేలు ఒకవైపు ఉంటారు. ఇప్పటికే విశాఖపట్నంలో దాదాపుగా 50 లక్షల జనాభా పైగా ఉండడంతో, రానున్న రోజుల్లో అది కాస్తా పెరిగి కాలుష్యాన్ని తీవ్రత పెంచేలా దెబ్బ తీయొచ్చు. ఇలా ఏ విధంగా చూసుకున్నా సగటు మానవుడికి విశాఖరాజధానిగా అంగీకరించకపోవచ్చు. 

        ఇక రాయలసీమ విషయానికి వస్తే సీమ ప్రజల ఆలోచన విధానాన్ని ఆసరాగా చేసుకొని పాలకులు తమ ఇష్టం వచ్చినట్టు నడిపిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వెనుకబడినందుకు పాలకులను విమర్శించాలో, ప్రజల ఆలోచనధోరణి మారలేదో తెలియట్లేదు.  ఒకసారి గతాన్ని చూసుకున్నట్లయితే పెద్ద మనుషుల ఒప్పందం ( శ్రీ భాగ్ ఒడంబడిక ) ద్వారా కూడా సీమ ప్రజలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మోసం జరుగూతూనే ఉంది. ఇప్పటి ప్రభుత్వం జ్యుడీషియల్ క్యాపిటల్ చేసినంత మాత్రానా తమ జీవితాలు బాగుపడుతాయని అనుకున్న ప్రజల ఆలోచనా ధోరణి అవివేకం. సీమకు ఒక హైకోర్టు వచ్చినంత మాత్రానా లక్షల్లో ఉద్యోగ కల్పన జరగదని గ్రహించాలి. సీమ ప్రజలు మా సీమలోనే క్యాపిటల్ రాజధానిని ఎందుకు ఏర్పాటు చేయట్లెదో ఆలోచించారా? కనీసం నాయకులు అయినా ఆ దిశగా పోరాడుతున్న పాపాన పోలేదు. అనంతపురం జిల్లాలోని ఒక వ్యక్తి పొరుగున ఉన్న కర్ణాటక రాజధానికి వెళ్లడానికి ఒక సినిమా చూసినంత సమయంలో వెళ్తాడు. అదే ఇపుడు పెట్టబోయే రాజధానికి వెళ్లాలంటే కనీసం 2 రోజుల సమయం పడుతుంది. శ్రీకాకుళంలో జిల్లాలో ఉన్న ఒక వ్యక్తి న్యాయపరమైన పనుల కోసం కర్నూలుకి వెళ్లాలంటే దాదాపుగా 2 రోజుల సమయం పడుతుంది. అదే పక్కనే ఉన్న ఒరిస్సా రాజధానికి కేవలం 3 గంటల్లో వెళ్తాడు. అలాంటప్పుడు ఒక సామాన్య మానవునికి రాజధాని ఎలా ఉపయోగపడుతుందో కాస్తా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. 

        ఒక సగటు మానవుడిగా నేను కోరుకునేది అన్నీ విధాలా అనుకూలంగా ఉన్న, ఇప్పటికే ప్రజా ధనాన్ని ఖర్చు చేసిన అమరావతిని రాజధానిగా ఉంచడం ఉత్తమం. పరిపాలానా ఒక చోట ఉంచి, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. వెనుకుబాటుతనంతో అనారోగ్యబారిన పడుతున్న ఉత్తరాంధ్రాకు ఉపాధి కల్పన పెంచి మరింత అభివృద్ధి చేయాలి. వలసలతో సతమతమవుతున్న రాయలసీమకు పరిశ్రమలు కల్పించి ఉద్యోగ కల్పన పెంచాలి. ఇలా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. 

    దక్షిణాఫ్రికాలో ఉన్న నమూనాను చూసి ఇక్కడ మూడు రాజధానులు పెట్టడం సరికాదు. అక్కడే మూడు రాజధానుల వల్ల చాలా కష్టతరంగా ఉందని అక్కడి ప్రభుత్వాలు వెల్లడించడం కూడా చూశాం. అభివృద్ధి కోసమే మూడు రాజధానులు పెట్టామని చెప్పే నాయకులు జిల్లాకో రాజధాని పెట్టి ఇంకా బాగా అభివృద్ధి చేయచ్చు కదా. అమరావతి రాజధానిగా గతంలో ప్రతిపక్షం అంగీకరించి ఇప్పుడు మార్చడం ఎంత తప్పు చేసిందో, ఇపుడున్న ప్రతిపక్షం కూడా ఆ రాజధానికి చట్టమైన గెజిటెడ్ తీసుకురాకపోవడం, తాత్కాలిక భవనాలతో సరిపెట్టుకోవడం కూడా అంతే తప్పు చేసింది. 

 

నోట్ : అంతార్జాలంలో కొంత సమాచారంతో కలిపి రాశాను. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way