హైదరాబాద్, (జనస్వరం) : బీసీలు హక్కుల కోసం ఉద్యమించే సమయంలో అంతా ఏకమవుతున్నారనీ, ఎన్నికల సమయానికి మాత్రం విడిపోతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బీసీల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2024 ఎన్నికల సమయానికి బీసీలు స్పష్టమైన అజెండాతో ఉండాలన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి చెందిన పలువురు నాయకులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. 23వ తేదీన హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించే జాతీయ స్థాయి సెమినార్ కి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి కులగణన, రిజర్వేషన్ల కల్పనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమం తాలూకు భావ వ్యాప్తికి నేను కట్టుబడి ఉన్నాను. అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పని చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆ కులాలకు స్వయం ప్రతిపత్తి, రాజ్యాధికారం తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. బీసీల హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమం తాలూకు భావ వ్యాప్తిని ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నా అసలు సమయానికి ఆచరణకు నోచుకోవడం లేదు. అందుకు రాజకీయపరమైన అవగాహన అవసరం. అందుకు సంబంధించి మథనం జరగాలి. యువతకు నాయకత్వాన్ని అప్పగించాలి. రాజకీయంగా ముందుకు వెళ్లాలి. బీసీ ఉద్యమానికి మద్దతుగా నా వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడుతాను” అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ నాయకులు ప్రజీత్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యర్రా సత్యనారాయణ, జక్కల వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శులు సుధాకర్ ముదిరాజ్, పెద్దవరపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.