అనంతపురము, ఏప్రిల్ 25, (జనస్వరం) : ఆర్.సి. టైమ్స్ ఛానల్ అధినేత, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రంగస్థల నటుడు ఏమినేని రవిచంద్రకు "బహుజన బంధు" అవార్డును ప్రదానం చేశారు. నక్కా రామారావు యాదవ కళ్యాణమండపంలో శనివారం డాక్టర్ పోతుల నాగరాజు ఆధ్వర్యంలో పలువురు సోషల్ మీడియా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. మూడు దశాబ్దాలకు పైగా వివిధ పత్రికల్లో పనిచేసిన ఏమినేని రవిచంద్ర గతంలో రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డును అందుకున్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం మీద పరిశోధనాత్మక కథనాలను అందించినందుకు గాను ఆయనకు ప్రత్యేక గౌరవం దక్కింది. ఆర్.సి. టైమ్స్ ఛానల్ ను ప్రారంభించి రైతుల కృషిని లోకానికి చాటి చెబుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాట్లాడుతూ, పౌరాణిక నటుడిగా, జర్నలిస్టుగా దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రవిచంద్రకు అవార్డు దక్కడం అభినందనీయమన్నారు. గతంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గ్రామీణ జర్నలిస్టుగా రెండుసార్లు అవార్డును అందుకున్నారనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బిసి నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.