
ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా, వారం రోజుల పాటు వివిధ ప్రజా సమస్యలపై ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ పోరాడాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దశాబ్దాలుగా దగాపడ్డ చుక్కల భూముల అన్నదాతలకు అండగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరుబాటకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు మాట్లాడుతూ చుక్కల భూముల రైతన్నల విషయానికి వస్తే తరతరాలుగా వంశపారంపర్యంగా దాన, విక్రయ, వినమయ తాధాతి సంపూర్ణ హక్కులతో సాగుచేసుకుంటున్న భూమిని, జీవో నెంబర్ 216 తో, 2016 వ సంవత్సరం ప్రభుత్వ నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగింది. భూమి అనేది అన్నదాత ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అన్నదాత ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన ఆస్తి హక్కును కాలరాస్తూ రైతన్న గుండెల్లో దింపిన గునపం, ఈ జీవో నెంబర్ 216 అని అన్నారు. ఎండనక, వాననక, రాత్రనక పగలనక, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక పోయినా, అతివృష్టి అనావృష్టి పరిస్థితులలో సర్వస్వం కోల్పోయినా, సమస్త మానవ జాతి మనుగడ కోసం తాను మట్టిలో కలిసే వరకు మట్టితో కలిసి పనిచేసే అన్నదాత నుదుటన రాసిన మరణశాసనం ఈ జీవో నెంబర్ 216. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించబడిన ఈ సమస్యను రాష్ట్ర విభజన అనంతరం, తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వమే తమ దగ్గర ఉన్న సమాచారాన్ని ఆధారం చేసుకుని ఈ సమస్యను సుమోటోగా పరిష్కరించడం జరిగింది. కానీ ఇందుకు విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం 2016 వ సంవత్సరంలో యిచ్చిన జీవో నెంబర్ 216 అన్నదాతల పాలిట అశనిపాతంగా తయారైంది. ప్రస్తుతమున్న ఈ ప్రభుత్వం ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే తెలంగాణ తరహాలో సుమోటోగా ఈ సమస్యను పరిష్కరించారు. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు కలిపి ఒక చట్టాన్ని చేస్తే కర్నూలు జిల్లాలో ఒకలా మిగిలిన 12 జిల్లాల్లో ఒకలా ఎలా అమలు పరుస్తున్నారు. ఇది ఎక్కడి రాజ్యాంగం? ఇప్పటికైనా మిగిలిన జిల్లాల్లో కూడా కర్నూలు జిల్లా తరహాలోనే ఈ సమస్యను సుమోటోగా పరిష్కరించాలని, లేకపోతే చుక్కల భూముల రైతన్నల పాలిట యమపాశంలా తయారైన ఈ జీవోను పూర్తిగా రద్దు చేయాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులతో పాటు, భారతీయ జనతా పార్టీ నాయకులు చెరుకూరి రమణప్ప నాయుడు గారు నలిశెట్టి శ్రీనివాసులు గారు కొలగాని వెంకటేశ్వర్లు గారు తదితురులు పాల్గొనడం జరిగింది.