అనంతపురం, సెప్టెంబర్ 27, జనస్వరం : నును లేత మొహాలపై/ యాసిడ్ సీసాలు విసిరి/ అఘాయిత్యాలకు పాల్పడి/ ఆత్మహత్యలకు పురిగొల్పిన /నీ రాక్షస ఆనవాళ్లు /ఆ మహిషాసుర మర్దినికి కనిపించవనుకుంటున్నావా.... అంటూ దసరా కవి గోష్టిలో కవితా గానం చేసిన తానా కవితా పురస్కార గ్రహీత ఆకుల రఘురామయ్యను ఘనంగా సన్మానించారు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని చేలూరు తాలూకా నందు గల మానస కాలేజీ ఆడిటోరియంలో అఖిల భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో శనివారము దసరా కవి గోష్టి ఘనంగా నిర్వహించారు.
తెలుగు,తమిళం, కొంకిణి, హిందీ, కన్నడ బహుభాషాలకు చెందిన ప్రముఖ కవుల సమ్మేళనంతో ఈ దసరా కవి గోష్టి నిర్వహించారు. ఈ కవి గోష్టిలో "ఆయుధ పూజ "అనే కవిత గానం చేసిన ఆకుల రఘురామయ్య తెలుగు విభాగంలో ప్రధమ స్థానంలో నిలిచారు. ఈ సందర్బంగా ఆకుల రఘురామయ్య ను అఖిల భారతీయ సాహిత్య పరిషత్ కర్ణాటక అధ్యక్షురాలు శ్రీమతి రాధామణి ఎం కోలార్, ఇతరుల చేతులమీదుగా ప్రశంసా పత్రము,జ్ఞాపిక, దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ సాహిత్య పరిషత్ కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల భాషాభిమానులు, కవులు, రచయితలు, మానస కాలేజీ విద్యార్థులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.