నెల్లూరు, మార్చి 29, జనస్వరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన నెల్లూరు జిల్లా న్యాయవాది సత్తు అంకయ్యకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యుడు వి. సుధీర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నగరంలోని జెట్టి శేషారెడ్డి భవనంలో నిర్వహించిన అభినందన సభలో సుధీర్ పాల్గొని, ఆలిండియా లాయర్స్ యూనియన్ ఐక్యవేదిక తరపున విజయం సాధించిన సీనియర్ న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్ మరియు సత్తు అంకయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన బార్ కౌన్సిల్ సభ్యులు న్యాయవాదుల సమస్యలను గుర్తించి, వారి పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఆకాంక్షించారు. వారికి ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ అభినందన సభను విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.