ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగం యొక్క సాగునీటి హక్కులను కాపాడాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు పోరుబాటు

                       నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగం యొక్క సాగునీటి హక్కులను కాపాడాలని కోరుతూ, ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో, స్థానిక మున్సిపల్ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఆత్మకూరు  నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్  నలిశెట్టి శ్రీధర్ గారు మాట్లాడుతూ రైతాంగం యొక్క దేవాలయం, సోమశిల జలాశయం మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. కారణం మన ప్రభుత్వ చేతకానితనం విభజన చట్టాలను ఉల్లంఘిస్తూ, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయలేక, జీవ జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నా, ఏమీ చేయలేక పాలకులు నిశ్చేష్టులయ్యారు. మన పాలకుల చేతగానితనం కారణంగా నెల్లూరు జిల్లాలో, సోమశిల జలాశయం మీద ఆధారపడ్డ కండలేరు జలాశయం, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజ్ ల మనుగడ ప్రశ్నార్థకమైంది. దరిమిలా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం సాగునీటి అవసరాలకు, ప్రజల తాగునీటి అవసరాలకు గడ్డు కాలం దాపురించింది. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో దగాపడ్డ మెట్ట ప్రాంత రైతాంగ ఆశలు అడియాశలయ్యాయి. పుష్కర కాలం క్రితం శంకుస్థాపన చేసిన ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోతుందా, మా బతుకులు బాగు పడక పోతాయా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మెట్ట ప్రాంత రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భవిష్యత్తులో ప్రాజెక్టులు పూర్తయినా వాటికి నీరు చేరే పరిస్థితి లేని అయోమయ స్థితి దాపురించింది అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తెలంగాణలోని ఆంధ్ర ప్రాంత ప్రజల క్షేమం కోసం, సంయమనం పాటిస్తున్నామన్న బేల పలుకులు మాని, మన రాష్ట్ర రైతాంగ సాగునీటి హక్కుల కోసం పోరాడాలని, లేనిపక్షంలో జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలోని దగాపడ్డ మెట్ట ప్రాంత రైతాంగ హక్కుల కోసం ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్  నలిశెట్టి శ్రీధర్ గారు  రైతులు మరియు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.