రామతీర్థం ఘటనపై పెల్లుబికిన ప్రజాగ్రహం : చిత్తూరు జిల్లా మూడు మండలాలలో జనసేన, బీజేపీ నేతల నిరసనలు

                రామతీర్థం క్షేత్రంలో దుండగులు శ్రీరామచంద్ర మూర్తి విగ్రహం తలనరికిన దుర్ఘటనకు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు హిందూ దేవాలయాలలో విగ్రహాలు ధ్వంసంచేయడం వంటి, అంతర్వేదిలో రధం దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనసేన, బీజేపీ నాయకులు శుక్రవారం పేర్కొని నిరసన వ్యక్తంచేశారు. హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా వెల్లంపల్లి నైతిక బాధ్యత పాటిస్తూ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దగాకోరు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. చేతకాని ప్రభుత్వం వెంటనే పాలన నుండి తప్పుకోవాలని ప్రజాగ్రహజ్వాలలు పెల్లుబికాయి. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం, కుప్పం, రామకుప్పం మండలాలలో జనసేన, బీజేపీ శ్రేణులు కదంతొక్కి రాష్ట్రప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. శాంతిపురం, కుప్పం, రామకుప్పం మండలాలలో జనసేనపార్టీ, బీజేపీపార్టీ నేతలు, కార్యకర్తలు, జనసైనికులు, ప్రజలతో కలసి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. . అనంతరం మండల రెవెన్యూ కార్యాలయాలలో తహశీల్దార్ లకు, వినతి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం గనుక తక్షణమే కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాయకులు ముక్తకంఠంతో ప్రభుత్వంను హెచ్చరించారు. ఈ కార్యక్రమాలలో శాంతిపురం, కుప్పం, రామకుప్పం మండల కమిటీ సభ్యులతో పాటు పలువురు జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.