నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ వెంటిలేటర్ మీద ఉంది

– పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 215వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ మసీదు సెంటర్ నుండి ఏసీ స్థూపం ప్రాంతం వరకు జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికి మూడు సార్లు తమ వైసీపీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ రెడ్డి పిలిపించుకుని గడప గడపకు మీద కౌన్సెలింగ్ ఇచ్చారని, మూడు సార్లు నెల్లూరు సిటీ వైసీపీ ఫెయిల్ అయిందని అన్నారు. సీఎం జగన్ రివ్యూ కి పిలవబోతున్నారు అనే సమాచారం వచ్చినపుడు మాత్రమే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వాలంటీర్లను, వార్డు సచివాలయ ఉద్యోగులను, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను, పోలీసులను వెంటేసుకుని తిరుగుతున్నారని, ఇటీవల ఆ వాలంటీర్లు, ఉద్యోగులు కూడా రాకపోవడంతో మనిషికి 500 ఇచ్చి తిప్పుకున్నారని, పొదుపు మహిళలకు లోన్లు రావని బెదిరించి అధికారులు పిలుస్తున్నారంటూ మాయమాటలు చెప్పి తిప్పుకున్నారని అన్నారు. నెల్లూరు సిటీ నియజకవర్గంలో వైసీపీ పరిస్థితి వెంటిలేటర్ మీద ఉందని ఎద్దేవా చేశారు. ఈ మూడేళ్ళలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కనీస స్థాయి అభివృద్ధి కూడా జరగకపోవడం, పైపెచ్చు మూడు కాలువల బినామీ కాంట్రాక్టుల కోసం పేదల ఇళ్ళను కూలగొట్టడం, ప్రత్యర్ధులపై దాడులకు తెగబడడం, అమాయకులపై అక్రమ కేసులు బనాయించడం వంటివి ఈ పరిస్థితికి కారణం అని అన్నారు. గడప గడపకు తిరిగి ప్రజలకు అభివాదం చేసే నైతికత వైసీపీ కోల్పోయిందని అన్నారు. ప్రజలందరూ పవనన్న ప్రజాబాటని అపూర్వంగా ఆదరిస్తున్నారని, ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచేది తామేనని, తామొచ్చాక నెల్లూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  ఆత్మకూరు నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం