అక్రమ హౌస్ అరెస్ట్ లతో వాస్తవాలని దాచి పెట్టలేరు : జనసేన పార్టీ టెక్కలి ఇంచార్జి కణితి కిరణ్
రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాల్లోని విగ్రహాలు, రథాలపై దాడులకు తెగబడుతున్న వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళడం లేదు. ఆ దాడులను నిరసించినవారిని అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధాలు చేయడాన్ని ఖండిస్తున్నాం. నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామ్యం లో ఉన్న ఒక హక్కు. అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవరిస్తుంది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రధం దగ్ధం ఘటన నేపథ్యంలో అక్కడకు వెళ్ళిన హిందూ భక్తులు, సాధువులు, నాయకులను అరెస్టులు చేసారు. వారిని తక్షణమే విడుదల చేయాలని జనసేన డిమాండ్ చేస్తుంది. ఆ అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఛలో అమలాపురం అని మా మిత్రపక్షము బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో టెక్కలి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులను, శ్రేణులను గురువారం రాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉంచడం. అదుపులోకి తీసుకోవడం, నోటీసులు జారీ చేయడం చేస్తున్నారు. ఈ తరహా చర్యలు అప్రజాస్వామికం, ఆలయాల విగ్రహాలు, రథాలపై దాడులు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న దోషులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. ఈ అక్రమ హౌస్ అరెస్ట్ లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని జనసేన పార్టీ హెచ్చరిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.