కరోనా విధుల్లో ఉన్నవారికి జీతాలు ఇవ్వకపోతే ఎలా? జనసేన బాడిశ మురళీకృష్ణ
కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజు రోజుకీ విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటం దురదృష్టకరమని కోవిడ్ -19 విధుల కోసం నిర్మించుకున్న మెడికల్ ఆఫీసర్లు స్పెషలిస్ట్ వైద్యులు స్టాఫ్ నర్స్ లతో పాటు ఇతర సిబ్బంది గత రెండు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని ఇది అత్యంత బాధాకరమని వెంటనే జీతాలు చెల్లించాలని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన జగ్గయ్యపేట లో పార్టీ ఆఫీస్ లో ఒక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా అంటే ప్రతి ఒక్కరూ భయపడిపోతున్న సమయంలో ఎంతో ధైర్యంగా వృత్తిపట్ల నిబద్ధతతో ఈ విధులకు వచ్చిన వారికి కనీస జీతాలు కూడా ఇవ్వకపోవడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ఎక్కడెక్కడో కరోనా విధులకు వారిని నియమిస్తే ఆ ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు చెల్లించుకుంటూ ఆహార నిత్యావసరాలకు వారు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరినే అవలంభిస్తుందని వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదన్నారు. తగిన విధంగా పి. పీ. ఈ కిట్లు, కనీసం గ్లౌజ్ లు, శానిటైజర్లు మాస్కులు ఇవ్వడం లేదని వైద్యులు, నర్సులు నిరసనలు తెలుపుతూనే ఉన్నారన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉన్నత స్థాయి వైద్య అధికారి నుంచి అవుట్ సోర్సింగ్ సిబ్బంది వరకు అందరికీ ఒక నెల జీతం అడ్వాన్స్ గా చెల్లించాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందని మురళీకృష్ణ పేర్కొన్నారు.