● అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామని, కుదరకపోతే మినిమం టైమ్ స్కేల్ జీతాలు ఇస్తామన్న జగన్ గారు మాట తప్పి మడమ తిప్పారు
● ఎన్నో ఆశలతో ఉన్న సుమారు 2వేల పైచిలుకు కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలను జీవో 110 తో అంధకారంలోకి నెట్టారు
● కనీస వేతనం రూ.58వేలు ఇచ్చి ఇతర ప్రయోజనాలు కల్పించాల్సి ఉండగా కేవలం రూ.35వేలకు పరిమితం చేసారు
● తెలంగాణలో ఉన్న వర్సిటీలలో పని చేసే కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.80వేలకు పైగా జీతం ఉంది, కానీ ఇక్కడ సగం ప్రయోజనం కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది
● తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయని ఇటీవల అక్కడి మంత్రి కేటీఆర్ చేసిన ఎద్దేవాకు ప్రత్యక్ష నిదర్శనం ఈ జీవో 110
● ఇక్కడ అరకొర జీతాలు పెంచి యూజీసీ ప్రమాణాలు అందుకునే పరిశోధనలు సాగాలంటే ఎలా?
● పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే వర్శిటీలలో విద్యాప్రమాణాలు మెరుగవుతాయి
● పవనన్న ప్రభుత్వంలో యూనివర్శిటీలలో కోర్సులు, విద్యార్థుల సంఖ్య, సెక్షన్లు పెంచి కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేస్తూ నూతన నియామకాలు చేపడతారు
● పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా ప్రతిరోజూ జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 52వ రోజున 39వ డివిజన్ లో ప్రారంభమైంది. ఈ డివిజన్లలో పార్టీ కార్యకర్తలు కేతంరెడ్డికి ఘన స్వాగతం పలికారు. మూలపేట అలంకార్ సెంటర్ లోని పలు వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్గించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 51రోజుల పాటు 3,4,5 డివిజన్లలో ప్రతి ఇంటికి చేరిన పవనన్న ప్రజాబాట నేడు 52వ రోజున 39వ డివిజన్లో మొదలుపెట్టామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందనేది ప్రజల నుండి తమకు లభిస్తున్న అపూర్వ స్పందనే నిదర్శనమన్నారు. నిన్నటి రోజున యూనివర్శిటీ కాంట్రాక్టు అధ్యాపకుల జీతాల పెరుగుదలపై వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఆర్టీ 110 పై ఈ సందర్భంగా కేతంరెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్శిటీలలో పనిచేసే సుమారు 2వేల మంది పైచిలుకు కాంట్రాక్టు అధ్యాపకుల జీతాల సమస్య దశాబ్దకాలానికి పైగా ఉందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఊరూరా పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే వర్శిటీలలో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకులందరినీ పర్మనెంట్ చేస్తామని, కుదరపోతే మినిమం టైమ్ స్కేల్ (రెగ్యులర్ తో సమానంగా కనీస వేతనం) ఇస్తామని ప్రతి జిల్లాలో మాటలను చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. కానీ ఇప్పుడు ఆచరణలో మాత్రం కనీస వేతనాలు ఇవ్వకుండా అధ్యాపకుల కుటుంబాలను అంధకారంలోకి నెట్టారని అన్నారు. యూజీసీ ప్రకారం కనీసం వేతనం 58వేల రూపాయలకు తోడు ఇతర ప్రయోజనాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 35వేల రూపాయలను మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం దారుణమని అన్నారు. తెలంగాణాలో ఇదే తరహాలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు 80వేల రూపాయలకు పైగా జీతం పొందుతున్నారని, సగౌరవంగా అక్కడి వర్శిటీలలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, పరిశోధనల్లో పురోగతి చూపిస్తున్నారని కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వాలు వీరి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ తెలంగాణలోని సగం ప్రయోజనాలు కూడా అందించట్లేదని దుయ్యబట్టారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయని ఇటీవల అక్కడి మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేసారని, ఇప్పుడు ఈ జీవో 110 ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రత్యక్ష నిదర్శనం అని అన్నారు. జీవో 110 ద్వారా 35వేల రూపాయల జీతం పెట్టారని, ఈ అరకొర జీతంతో అధ్యాపకుల ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని అన్నారు. యూజీసీ ప్రామాణికం ఉన్న జర్నల్లలో పరిశోధనా పత్రాలు ఈ జీతాలతో ఎలా వేయగలరని, పరిశోధనల్లో పురోగతి ఎలా వస్తుందని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి మోసం చేసే వారికి అధికారం ఇస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయని, కనుక కాంట్రాక్టు అధ్యాపకులందరూ ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినా పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని కోరారు. గతంలో పవన్ కళ్యాణ్ ని పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు కలిసినప్పుడు తప్పక న్యాయం చేస్తామని మాట ఇచ్చారని, గత ఎన్నికల మేనిఫెస్టోలో సైతం కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమం టైమ్ స్కేల్ ఇచ్చి ఇతర బాధ్యతలు అప్పజెప్పుతాం అని పొందుపరిచారని, కావాలంటే తమ మ్యానిఫెస్టోని ఎవరైనా పరిశీలించుకోవచ్చు అని అన్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కల్గించాలని, ఎలా పర్మనంట్ చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారని కేతంరెడ్డి తెలిపారు. పవనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలలో విద్యా ప్రమాణాలు పెంచుతారని, వర్శిటీలలో కోర్సులను, విద్యార్థుల సంఖ్యను, కోర్సుల సెక్షన్ల సంఖ్యను పెంచి ప్రతి ఒక్క కాంట్రాక్టు అధ్యాపకునికి న్యాయం చేసి నూతన నియామకాలను సైతం చేపడతారని కేతంరెడ్డి తెలిపారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తమ ఆశీస్సులు అందిస్తున్నారని, ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినా పవనన్నకి అండగా నిలవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
